Wednesday 25 June 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 27

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 27

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య  క్రమణ మశనాద్యాహుతి విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యా పర్యాయ స్తవభవతు యన్మే విలసితమ్ || 27 ||

అమ్మా, భగవతీ! ఆత్మార్పణ దృష్టితో నేను చేసే సల్లాపం నీ మంత్ర జపంగాను, నా హస్త విన్యాసమంతా నీ అర్చనలో ముద్రా రచనగాను, నా స్వేచ్ఛాగమనం నీకు గావించే ప్రదక్షిణగాను, నా భోజనాదులు నీకు ఆహుతిగాను, నా శయనక్రియ నీకు ప్రణామంగాను, నా సుఖ లాలసాలన్నీ  నీ పూజా విలసనముగాను అగుగాక! అలా అయ్యేట్లు నువ్వు నన్ను కరుణించు తల్లీ అని భావం.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ   శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు ఆత్మార్పణ దృష్టి అంటే ఏమిటో మనకు  తెలియ జేస్తున్నారు. అత్భుతమైన శ్లోకము ఇది. నాకు చాలా ఇష్టమైన శ్లోకము. రోజుకు ఒక్కసారైనా చదువుకోవడం మంచిది.

ముందరి కాళ్ళకు బంధం వేశారు జగద్గురువులు ఇక్కడ. ఆత్మార్పణ అని. ఆత్మార్పణ లేకుండా వూరికే మాటలు చెబితే లాభం లేదు.   జగద్గురువులు చెప్పారు కదా అని పూజాదులు, అనుష్ఠానం లేకుండా, మానేసి,  యోగం అనే పేరుతో అందరూ పైకి మాటలు చెబుతూ తప్పించు కొంటున్నారు. ఇది తగదు. భావన రావాలి. నిజంగా అలా ఆత్మార్పణ దృష్టి కలిగి యుండాలి. మనం చేసే ప్రతి క్రియలోను, ప్రతి చేష్ట లోను ఆ బుద్ధి రావాలి, ఆ సమర్పణ రావాలి, అప్పడు అది అంతర్యాగము అవుతుంది. ప్రతి క్షణం, ప్రతి క్రియ లోను  అమ్మా....అమ్మా అని కలవరించాలి, పలువరించాలి, కోటకలాడలి. అసలు ఆ స్పృహ కలగాలి. ఆ స్పృహ తో చేయాలి అప్పుడే అది ఆత్మ నివేదన అవుతుంది.
తల్లీ, నిదుర లేచి నప్పటి నుంచి ఏవేవో పనికి మాలిన మాటలు ఎన్నో మాట్లాడుతూ వుంటాను. నీ జపం చేయడానికి మాత్రం సమయం దొరకదు. మిగతా అనవసరమైన  విషయములు, వ్యవహారిక విషయములు,  మాట్లాడటానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం  వస్తుంది. లలితా సహస్ర నామం చేయాలంటే మాత్రం మనస్సుకు సమయం దొరకదు. మూడు గంటలు సినిమాలు, సీరియల్స్ చూడటానికి సమయం దొరుకుతుంది కానీ నీముందు మోకరిల్లడానికి ఒక్క పది నిముషాలు దొరకదు గదా. Time లేదండీ అని అంటాము.  వెదవది ఈ మనస్సు పట్టుకోదు గదా, అనవసరమైన  బంధనాలలో చిక్కుకొని, కొన్నింటిని చేజేతులారా తగిలించుకొని మొహంతో, మాయతో  తల్లడిల్లి పోయి, అదే శాశ్వతమని అల్లాడి పోతూ వుంటాము. ఏది శ్వాశ్వతం ఏది బంధం అని దీర్ఘంగా ఆలోచిస్తే నీ భార్యా భర్తలు, నీ తల్ల్లిదండ్రులు, మీ తాతా అమ్మమలు, నీ సోదరీ సోదరులు,  నీ వాళ్ళు, నీ ముఖ్య స్నేహితులు . వీళ్ళు నీ ముఖ్య బంధువులు. వీళ్ళను మించి మనము ఎక్కువ పెట్టుకోన్నామా అవి అన్నీ అనవసర బంధనాలు మాత్రమే, స్వార్ధ చింతనతో కూడిన అధర్మ బద్ద సాంగత్యాలు మాత్రమే. అవి కర్మ బంధనాలు. ఎంత తక్కువ చేసుకొంటే అంత మంచిది. కొన్ని మనము కోరి తెచ్చుకొంటాము, వాటితో అనవసరంగా బాధపడ్తూ ఉంటాము. విషయ బంధనాలు ఎంత తక్కువ చేసుకొంటే అంత మంచిది. బాహ్య ప్రపంచాన్ని చూసే వాడు లోపలికి చూడ లేడు, లోపలికి చూడడం నేర్చుకొన్నవాడు బయటకు చూడలేడు. అంటే బయట ప్రపంచం కనిపించదు. ప్రతి నిమిషం ఆ దేవ దేవుణ్ణి ఎలా స్మరించాలో ఇక్కడ గురువులు మనకు నేర్పిస్తున్నారు. ప్రతిది భగవత్ కైంకర్యముతో ముడి వేయాలి. సమర్పణ బుద్దితో చేయాలి అని చెప్పారు.

జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా

జల్పము అంటే ఉపయుక్తము కాని మాటలు  మాటలాడుట అంటే పనికి మాలిన మాటలు మాటలాడుట. వ్యర్ధ ప్రసంగము అని అర్ధము. అమ్మా భగవతీ, నిద్ర లేచి నప్పటి నుంచి పడుకొనే దాక నేను మాట్లాడే ప్రతి మాట, నీ జపం క్రింద లెక్క వేసుకో తల్లీ. నీ మంత్ర జపం చేస్తున్నాను అనుకో. అక్షర లక్షలు జపం చేసాడు ఈ భాస్కరానంద నాథ అని వ్రాసుకో. నా మాటలు నీ మంత్ర జపము అగు గాక.
శిల్పం అంటే హస్త విన్యాసములు. అమ్మా నేను చేతులు అటు ఇటు త్రిప్పుతూ ఉంటా ఏమీ తోచక అవి అన్నీ నీ ముద్రలు అనుకో. శ్రీవిద్యలో శ్రీచక్రార్చన చేసేటప్పుడు దశ ముద్రలు ప్రదర్శించాలి. కాబట్టి అవి అన్నీ నాకు రావు, ఒకవేళ వచ్చినా ఓపిక లేదు. కాబట్టి నా హస్త క్రియాలాపములు అన్నింటిని నీ ముద్రలు క్రింద జమ కట్టుకొని సంతోషించు. ఏదోలే చిన్న పిల్లవాడు అని సర్దుకో. కోపగించకోకు నా పైన. నీ బిడ్డను అమ్మా నేను. 
(Navigation signals లాగ, తప్పకుండ శ్రీచక్రము ముందు ప్రదర్శించాలి.) మంత్రము లేకుండా దశ ముద్రలతో అమ్మను ఆవాహన, ఆసనాది క్రమములు  చేయవచ్చును, పూజ పూర్తిచేయవచ్చును.

గతిః ప్రాదక్షిణ్య  క్రమణ మశనాద్యాహుతి విధిః
అమ్మా భవానీ, నేను గతి తప్పి కాలు కాలిన పిల్లి లాగ అటు ఇటు నడిచే నా నడక నీకు ప్రదిక్షణం అగు గాక. నీకు పద్దతిగా, శాస్త్రీయముగా  ముమ్మార్లు ప్రదిక్షణ చేశాను అని వ్రాసుకో తల్లీ. అశనము అంటే భోజనము అని అర్ధము.  నేను తినే ఆహారము అంతయూ నీకు నివేదన అగుగాక, ఆహుతి అగు గాక. నా ఆకలి కోసం నేను తినే పదార్ధములన్నీ నీకు యజ్ఞ హవిస్సులు అగు గాక. నీకు సమర్పించాను అని అనుకో తల్లీ. ఎందుకంటే నా కడుపులో వుండి తింటున్నది నీవే కదా. జఠరాగ్ని రూపములో పచనము చేస్తున్నది నీవే కదా. అది లేక పోతే నేను తిన్నది నాకు అరగదు కదా. కాబట్టి నీకు సమర్పించాను అని అనుకో.

ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా
అమ్మా కాత్యాయనీ, నిద్ర పోయేటప్పుడు  నాకు నేను  వొళ్ళు తెలియకుండా అటు ఇటు దొర్లడం చేస్తూ ఉంటా, అవన్నీ నీకు నేను చేసే సాష్టాంగ దండ ప్రణామములు అని జమ కట్టుకో. మరలా నీ గుడికి వచ్చి నేను విడిగా చేయలేను, నీ చుట్టూ తిరగ లేను. సంవేశము అంటే నిద్ర పోవుట, పండుకొనుట.
అనుభవించమని, ఆనందించమని నీవు నాకు ప్రాసాదించిన సుఖ వస్తువులతో, పంచేంద్రియములతో నే జరుపు సరస కల్లాపము లన్నీ నీకు సమగ్రమైన, సంపూర్ణ మైన పూజ అగు గాక.
అలా అగునట్లు నీవు నన్ను అనుగ్రహించు అమ్మా. ఏదో తెలియని వాణ్ని, చేతకాని వాణ్ని, ఓపిక లేని వాడ్ని. బద్దకస్థుడ్ని.
కానీ అమ్మా నా మనసు మాత్రం నీ దగ్గరే వున్నది. నీ పాదాల చెంతనే వున్నది. నీ బిడ్డనమ్మా నేను. ఆత్మార్పణతో నే గావించే ఈ సమస్త క్రియలు నీ శ్రీచక్రార్చన అగుగాక తల్లిరో తల్లి.


ఇదే విషయాన్ని జగద్గురువులు శివ మానస పూజలో ఇలా చెప్పినారు.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ||  ..... శివ మానస పూజ

ఓ శంభో ! నా ఆత్మయే నీవు; నాలో బుద్ధి రూపములో  పనిచేయున్నది సాక్షాత్తూ గిరిజాదేవియే (పార్వతీ దేవి); నాలోని పంచ ప్రాణములే మీ సహచరులు (గణములు); నా ఈ శరీరమే మీ గృహము; ఈ శరీరముద్వారా నేను అనుభవించెడి విషయ భోగములన్నియూ నేను మీకు ఆచరించుచున్నట్టి పూజయే; నా నిద్రే సమాధి స్థితి; నా పాదములద్వారా నేను చేస్తున్న సంచారమంతా మీకు నేను చేస్తున్న ప్రదక్షిణలే; నే పలుకుచున్న మాటలన్నీ మీ స్తోత్రములే; నేను చేయుచున్నట్టి కర్మలన్నీ, మీయొక్క ఆరాధనయే!

కరచరణ కృతం వా, కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||……… శివ మానస పూజ.

నా కర చరణములు, వాక్కు, శరీరములతో చేసిన కర్మలలోగానీ, నా కన్నులు, చెవులుతోగానీ, మానసికంగాగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, నే చేసిన అపరాధములు అన్నింటినీ, కరుణా సముద్రుడవైన ఓ మహాదేవ శంభోనీవు దయతో క్షమించుము.

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;.....భాగవతము.

నా మనస్సును, పంచేంద్రియములను, కర్మేంద్రియములను నీ ఎడల భక్తి భావముతో సమర్పణ దృష్టి తో వినియోగిస్తున్నాను తల్లీ, అలా కానినాడు నేను రెండు కాళ్ళ జంతువుతో సమానము.

జపో జల్పః శిల్పం..... జపము, జల్పము, శిల్పము అని గొప్ప రహస్యమును చెప్పుచున్నారు గురువు గారు.   జపము మనస్సుతో చేసేది, జల్పము అంటే మాటలు వాచా, వాక్కుతో చేసేది.
 శిల్పము అంటే చేష్టలు అంటే చేతులతో, కాళ్ళతో చేసేది, కర్మణా.
మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్దిగా అమ్మను ఆత్మార్పణ దృష్టితో ఆరాధించాలి అని చెబుతున్నారు. అప్పుడే పూజ సంపూర్ణము అవుతుంది అని దీని రహస్యము. ఈ పద్య రహస్యాన్ని మూడు ముక్కలలో ముందుగానే మనకు చెప్పినారు. మనసా, వాచా, కర్మణా, జపో జల్పః శిల్పం..... అని.

జపో ......అని శంకర భగవత్పాదులు ముందుగా అన్నారు. జపానికి కారణభూతమైనది మనస్సు. ఇంద్రియములకును విషయములకును అన్నింటికినీ మూల కారణము మనస్సే. మనోపాసన చేయవలెను. అంటే అమ్మ నామము గాని, మంత్రము గాని జపించవలెను. జపము వలెనే  కర్మ క్షయము అవుతంది. ఆత్మను సమర్పించడం అంటే మనస్సు ను సమర్పించడం అన్నమాట. మనస్సు ఒక్కటి ఇస్తే చాలు అమ్మకు. కర్మ పరి పక్వం అవుతుంది. అంగాంగముల శుద్ధి అంటే ఇదే. వాచక శుద్ధి, కాయక శుద్ధి. నోటితో, చేతులతో, కళ్ళతో, కాళ్ళతో, చెవులతో, శరీరముతో చేసే పాపములు పోగొట్టుకోవాలి అంటే, నోటితో భగవన్నామము జపించాలి, చేతులతో పూజించాలి, కళ్ళతో భగవంతుని దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి, కాళ్ళతో ప్రదక్షిణ చేయాలి, చెవులతో నామం, కీర్తనలు వినాలి, శరీరముతో యజ్ఞము చేయాలి. అనవసర మైన వ్యర్ధ ప్రసంగములు మాని మనకు వున్న కొద్దిపాటి సమయాన్ని భగవంతుణ్ణి సేవలో గడపమని గురువు గారి హెచ్చరిక. అమ్మకు ముద్రలు అంటే చాలా చాలా ఇష్టం, ఆవాహనాది ముద్రలు చూపితే అమ్మ సంతోషిస్తుంది.
జల్పం ... వ్యర్ధ ప్రసంగములు. ఎన్ని ఏండ్లు వచ్చినా, ఎంత వయస్సు వచ్చినా, ఎంత మంది మొత్తుకొన్నా మనషులు మారరు. పనికి మాలిన విషయముల మీద అనవసరమైన చర్చ, ఎదుటి వారిని సూటి పోటీ మాటలతో కుళ్ళ పొడవడము, విమర్శించడం  ఇదే అలవాటు. ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనము? దీని వలన ఓరిగేది ఏమిటి? ఎవడి పుణ్యము వాడిది, ఎవడి కర్మ వాడిది. నీవు ఏమీ చేయలేవు. నీవు ఆపలేవు.  జ్ఞానము అనంతము. ఎవడు మూట కట్టుకొన్నది వాడికే స్వంతము. వాడు స్వర్గానికి పోతాడు, నీవు నరకానికి పోతావు చివరకి. డబ్బును దోచుకోవచ్చు కానీ జ్ఞానమును దోచుకోలేవు. ఎదుటి వాడిని విమర్శించడము, ఎగతాళి చేయడము. అవసరమా. చివరకు నీకు ఉపయోగము ఏమిటి? దొరికిన కాస్త సమయము కూడా భగవంతుని సేవలో ఉపయోగిస్తే, నలుగురికి నాలుగు మంచి మాటలు చెబితే. భాగవత కధలు గురించి చర్చిస్తే ఎంత మంచిది. ఇకనైనా మారు, కాలము మించి పోతున్నది దొరికిన పది నిమిషములు అయినా సరే కృష్ణా, గోవిందా అను,  వ్యర్ధ ప్రసంగములు మాను అని వాత పెట్టి శ్రీ గురువులు మనకు చెబుతున్నారు.

యోగరతో వా భోగరతోవా సంగరతో వా సంగవీహినః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ ||

శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం పరాత్పరే
      యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/26-06-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/
 www.facebook.com/sribhaskaranandanatha/


సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 26

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 26

విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా
మహాసంహారేzస్మిన్విహరతి సతి త్వత్పతిరసౌ || 26 ||

తల్లీ ! జగజ్జననీ! మహాప్రళయం సంభవించిన సమయంలో బ్రహ్మ పంచభూతాలలో లయమవుతున్నాడు. మహావిష్ణువు నిర్లిప్తుడవుతున్నాడు. యముడూ వినాశనాన్ని పొందుతున్నాడు. కుబేరుడు కాల ధర్మం చెందుతున్నాడు.  పదునల్గురు మనువులు, ఇంద్రులు కన్నుమూస్తున్నారు. కాని ఓ పతివ్రతా! ఆ సమయంలో కూడా నీ భర్త సదాశివుడు, నీ పాతివ్రత్య మాహాత్మ్యం వల్ల,  విశృంఖలుడై స్వేఛ్ఛగా విహరిస్తున్నాడు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.
  

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)
భవానిని సన్నుతించ, ‘భాస్కర ప్రియఅను నామఁబున  నే తెల్పేద నా
భావంబువిభుద జనులు మెచ్చంగ, భక్తి తోడన్ భాస్కరా !

పై  శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క  పాతివ్రత్య మాహాత్మ్యం ను  తెలియ జేస్తున్నారు.

శివ రూపం శక్తి రూపం బ్రహ్మ స్వరూప రూపకమ్,
త్రిపురాం పరమేశానీం మహా ప్రళయ సాక్షిణీమ్ ||

అంత్యములో, మహా ప్రళయ కాలంలో, యుగాంతము నందు   పరమేశ్వరుడు, పరమేశ్వరీ సాక్షులుగా ఉంటూ జరుగుతున్న ప్రళయాన్ని చూస్తూ వుంటారు. అదిగో మహా ప్రళయం వీక్షించండి.

సృష్టిలో ఏదియునూ క్రొత్తగా సృష్టించబడదు, పూర్తిగా నశింప బడదు. ప్రతి పదార్ధమూ ప్రతి జీవి ఒక రూపము లోనుంచి ఇంకో రూపములోకి మారుతూ పాతది అంతమౌతూ వస్తుంది. చివరకు అన్నీ ఒకే రూపంలో కలిసి పోతాయి. ఒక పదార్ధము ఇంకో పదార్ధము లోకి, ఒక అణువు ఇంకో అణువులోకి కలిసి పోతూ, మార్పు చెందుతూ మహా ప్రళయంలో జీవ రాశి అంతా నాశనం అయి ఒకే ఒక పదార్ధముగా రూపాంతరము చెంది బ్రహ్మం లోకి కలిసి పోతుంది.

జీవ రాశి అంతా పంచ భూతములలో కలిసిపోతుంది. భూమి నీటిలో, నీరు అగ్నిలో, అగ్ని వాయువు ఆకాశంలో కలిసిపోతుంది. గ్రహములన్నీ సూర్య చంద్రులలో కలిసి పోతాయి. సూర్య చంద్రులు ఒకటైపోతారు. సూర్యుడు సూర్యుడులో కలిసిపోతాడు. గ్రహములన్నీ గతులు తప్పి ఒకదానిలో ఒకటి ఢీ కొని ఆకాశమంతా దుమ్ము ధూళితో నిండి, సూర్యుడు కప్పబడి పోతాడు. గ్రహాంతరాలములన్నీ ఏకమై పోతాయి. మొత్తం బ్రహ్మాండము లోని ప్రతిదీ ఒక దానిలో ఒకటి కలిసి పోతూ చివరకు పంచ బ్రహ్మాలలో కలిసి పోతుంది. పంచ బ్రహ్మలు త్రిమూర్తులుగా మారుతారు. ఆ త్రిమూర్తులు ఒకరిలో ఒకరు కలిసి, త్రిగుణములు ఏక గుణమై ఒకే ఒక శక్తిగా మారిపోతుంది. ఆ మహా శక్తియే నిర్గుణాకారమైన ఒక బ్రహ్మాండమైన మహా కారణ బిందువుగా రూపాంతరము చెందుతుంది.
శ్లో||శివశక్తి సమాశ్లేష స్ఫుర ద్యోమాంత రేపునః , ప్రకాశాయతీ విశ్వం సా సూక్ష్మ రూప స్థితం సదా.
     బీజ రూపా మహాముద్రా సర్వసిద్ధి మయేస్థితా ........యోగినీ హృదయం

ప్రళయం సంభవించినప్పుడు జగత్తులోని జీవ రాశి అంతా నాశనమయి పోతుంది. ఈ జీవులలో అన్నీ ముక్తిని పొందవు. కొన్నిటికి ప్రారబ్ద కర్మ ఇంకా ఉంటంది. అటువంటి జీవులు తమ ప్రారబ్ద విశేషములతో  మాయలో కలిసి పోతారు. ఆ మాయ చిచ్చక్తిగా మారి బ్రహ్మానందము ననుభావిస్తూ మిగిలిన జీవులతో కలిసి పరబ్రహ్మ యందు సామరస్యము పొందుతుంది. ఈ పరిస్థితులలో పరబ్రహ్మము పూర్ణ బిందు రూపుడై మహా కారణ బిందువుగా  అమ్మతో కలిసి ఉంటాడు. మర్రి విత్తనంలో పెద్ద మర్రి వృక్షము దాగి వున్నట్లు. ఈ విశాలమైన విశ్వమంతా, సృష్టి అంతా సూక్ష్మ రూపం లో, బీజ రూపం లో దాగి వుంటుంది.
ఒకే తత్వము, ఒకే గుణము, ఒకే రూపము, ఒకే ఒక బిందువు. అదే బ్రహ్మ పదార్ధము. అదే పర బ్రహ్మము. అదే పరమాత్మ. ఆయనే సదా శివుడు.
శ్రు|| సర్వం ఖల్విదం బ్రహ్మ.....చాందోగ్యోపనిషత్తు. 
........ఏక మేవా ద్వితీయం......తన కంటే రెండవది లేక సర్వము తానే యైనది బ్రహ్మము.
నామ రూపాత్మకమగు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయివున్నది. ఈ జగత్తు దాని నుండియే కలిగినది, దాని యందే లయ మగుచున్నది.

శ్లో|| తన్మయీం పరమానంద నందితాం స్పంద రూపిణీం,
      నిసర్గ సుందరీం దేవీం జ్ఞాత్వా స్వైరము పాసతే || ..... యోగినీ హృదయం

పరదేవత తానే మంత్ర తంత్రము అయివున్నది. శక్తి స్వరూపిణి అయిన దేవి ప్రకాశాంశతో, శివుని తో  సామరస్యము  పొంది పరమానందము పొందుచూ సృష్టి ఆరంభ కాలమున ప్రకాశ శక్తి నుంచి విడివడి జగద్రూపము పొంది సృష్టించిన జగత్తుకు స్థితి కల్పిస్తుంది. సంహార కాలమున పరమ శివునిలో లీనమవుతున్నది. ఈ విధముగా జగన్మాత సృష్టి స్థితి సంహార రూపములుగా ప్రకాశించు చున్నది.

 విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం

పంచత్వము  అంటే చావు, పంచ భావము అని అర్ధము. శరీరము పంచ భూతాత్మకము గనుక చనిపోయినప్పుడు ఆయా అంశలు ఆయా భూతములలో కలిసిపోవును గనుక పంచత అన్నారు. పంచత అనగా మరణము అని, పంచత్వము అంటే పంచ భూతములలో కలిసి పోవుట అని అర్ధము. పంచత లో నుంచి వచ్చినదే పంచనామా.
ప్రళయ కాలము నందు, లోకాలను సృష్టి చేసే బ్రహ్మ (విరంచి) పంచత్వాన్ని పొందుతాడు, మరణిస్తాడు, హరి కూడా విరామము పొందుతాడు, దీర్ఘ నిద్ర లోకి జారు కొంటాడు, తన పరిపాలన రక్షణాధికారాలు మాని విశ్రాంతి పొందుతాడు.

వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్
మృత్యువు నకు అధిపతియైన యముడు (కీనాశుఁడు) సైతము మహా ప్రళయ కాలమున నశిస్తాడు. నవ నిధులకు అధిపతియైన కుబేరుడు కూడా నిధన మౌతాడు, మరణిస్తాడు.

వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా
ఇంద్రుని పరివారమైన చతుర్దశ మనువులు కూడా కన్నులు మూసుకొని (సమ్మీలితదృశా) గాఢ నిద్రలోకి జారుకొంటారు.

మహాసంహారేzస్మిన్విహరతి సతి త్వత్పతిరసౌ
తల్లీ, మహా ప్రళయ కాలమున బ్రహ్మ, విష్ణువు, యముడు, కుబేరుడు, ఇంద్రాదులు అందరూ మృతి చెందుతారు. ప్రపంచం అంతా నాశనమౌతుంది.  కానీ మహాదేవుడు మాత్రం ప్రళయ కాలమున మహా తాండవము చేస్తూ నిలబడి పోతాడు. అందరూ పడిపోతున్నారు కానీ శివుడు మాత్రం పడిపోలేదు అమ్మా. మహాదానందముతో చిందులు త్రోక్కుతున్నాడు. ఎందుకనీ?
ఎందుకంటే అమ్మా అదంతా నీ మాంగల్యం బలం.  సుమంగళీత్వం.  అందరూ పంచత్వం పొందినా శివునికి పంచత్వం లేదు. నీ పాతివ్రత్య మహిమ అలాంటిది.  ఎందుకంటే నీవు సర్వ మంగళవు కదా!

అందుకని జగద్గురువులు సతీ అని సంభోదించినారు.  సతీ, సాధ్వీ, పతివ్రతా అని అమరకోశ అర్ధము. అనన్య సామాన్యమైన పాతివ్రత్యము గలది. శివుడే భర్త అని నియమముగా  గలది గాన సదాశివ పతివ్రత అయినది. శివుని వలె శివ పత్నీత్వము ఎల్లప్పుడూ ఉండును. సర్వ మంగళములకు నిలయమైనందున సర్వ మంగళ అయినది అమ్మ. అటువంటి తల్లి చెంతనుండగా మా అయ్యకు కొదవేమిటి?

శ్లో|| సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని, గుణాశ్రయే గుణమయే నారాయణి నమోzస్తుతే.

జగత్తును సృజించునట్టియు, పోషించునట్టియు, నశింపజేయునట్టియు శక్తి గలదానవును, నిత్యవును, త్రిగుణములకు నిలయమవును, త్రిగుణ స్వరూపవును, అగు ఓ ... నారాయణీ నీకు ప్రణామములు.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/25-06-2014 @ శ్రీకాళహస్తి

Saturday 21 June 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 25

సౌందర్యలహరిభాస్కర ప్రియ – 25

త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్పూజా పూజా తవ చరణయోర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తంసమకుటాః || 25 ||

ఓ శివానీ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించిన వారైన త్రిమూర్తులకు చేసే పూజ కూడా. వారికి ప్రత్యేక పూజలవసరం లేదు. ఎందుకంటే వారు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో చేరి, హస్తాలు తమ మణిమయ శిరోమకుటాలకు తాకునట్లు వహించి మొక్కుతూ, నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు. భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావం.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క గొప్పతనాన్ని  మనకు తెలియ జేస్తున్నారు.

శివా అన్నా శివే అన్నా ...శివుని రాణి అని అర్ధం...... Mrs. Siva అని అర్ధం.  వేద పురాణ కాలములోనే భార్యను భర్త పేరుతో పిలిచేవారు. ఈ సంస్కృతి మన నుంచి పశ్చిమ దేశాలకు వచ్చినది. భవాని, రుద్రాణి, ఇంద్రాణి, అని భర్త పేరు మీద భార్యలను పిలిచే వారు. అలా శంకరులు శివే అని అన్నారు.
శివే ..మంగళ ప్రదమైనది.  మంగళకర గుణములు కలది గాన శివా అని, శివే అని అందురు. శమింప జేయునది గాన శివే అని, మోక్షము ఇచ్చునది గాన శివా, శివే అని అందురు.  
శివుడెట్లో దేవి అట్లు, శివునకు దేవికి భేదము లేదు. అందుకని శివే అన్నారు. అమ్మ ఎలా మూలమైనది? ఈ సృష్టికి తల్లి అయినది కాన, ప్రకృతి ఆమె గనుక ఈ ప్రకృతి లో నుంచి జగత్తు వచ్చినది గనుక అమ్మ మంగళ కరమైనది. పూర్ణ గర్భిణి అయినది.

అయ్య పేరు మీదుగా అమ్మ పేరు. ఎంత మర్యాద? ఆడ వాళ్ళను  భర్త పేరుతో, ఇంటి పేరుతో పిలవడం ఎంతో మర్యాద. వావిళ్ళ వారు, యద్దనపూడి వారు, వింజమూరి వారు, ... ఇలా.
అలాగే ఆడవాళ్ళను వాళ్ళ భర్త పేరు మీదుగా  పిలవడం Mrs. RAO అని, మీనాక్షీ సుందరం, లలితా సుబ్రహ్మణ్యం అని కూడా.
అయ్యవారిని, అమ్మవారిని ఒకేసారి తలుచుకోవడం. మరలా వేరుగా స్మరించే అవసరం లేకుండా.

నీ వల్ల గుణ దోషమేమి, నా వల్లనే కానీ .... నా వల్లనే కానీ.... నీ వల్ల గుణ దోషమేమి.....రామా....
అని శ్రీ త్యాగరాజు కొనియాడినారు.  మనస్సు త్రిగుణ జనితమైనది. శరీరం త్రిదోషములతో కూడినది.
సత్వ, రజ, తమో గుణములతో కూడినది మనస్సు. వాత, పిత్త, కఫ దోషములతో కూడినది శరీరము. జీవుడు తన ప్రారబ్ధ  ఖర్మ చేత త్రిగుణముల యొక్క నిష్పత్తి తో జన్మ తీసుకొంటాడు. ఆ గుణ దోషముల చేత మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ గుణములను తారుమారు చేయాలంటే భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యం.

త్రిగుణాత్మికా .... సత్వ, రజ, తమో గుణములను ఆశ్రయించి ఉండునది, మూడు గుణముల స్వరూపము గలది. గుణ త్రయమునకు కారణభూతురాలైనది. మూడు బిందువుల కలయకే మూల ప్రకృతి.  అమ్మ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే త్రిగుణములతో కూడినది. సృష్టి లోని ప్రతి ప్రాణి కూడా త్రిగుణములతో ఏర్పడినదే. పుట్టినది అంటే త్రిగుణములతో కూడినది అని అర్ధము. ఎవ్వరినా ఈ మూడు గుణముల తోనే పుట్టాలి.  త్రిగుణాతీతుడు పరమ శివుడు ఒక్కడే. మిగతా వాళ్ళు అందరూ త్రిగుణములకు లోబడిన వారే.

సత్త్వాది గుణములకు నిధి వంటిది అమ్మ. సృష్టి ఆది నందు బ్రహ్మ పదార్ధము సంపూర్ణముగా వున్నది. సృష్టి ఆవిర్భావ కాలము నందు గుణ త్రయ సంయుక్తమైన అవ్యక్తము ఉత్పన్నము అయినది. కాన గుణ త్రయమునకు శ్రిదేవియే కారణభూతురాలు, స్థానభూతురాలు అని భావము. అందుకే ఆమె గుణనిధి అయినది....(లలితా సహస్రనామం).

కామ కామేశ్వరుల సంయోగ రూపమే జగన్మాత సగుణ రూపమని, “తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం”...ఇత్యాది ఋక్కుల యందు లలితా దేవి అగ్ని వర్ణము గలదని చెప్పబడెను. అరుణాం కరుణాతరంగి తాక్షీం .....అని దేవిని అరుణ కాంతితో ఎరుపు వర్ణము తో పోల్చివున్నారు.
 పుట్టుక లేని మాయ మూల ప్రకృతి ఎరుపు, నలుపు, తెలుపు వర్ణములు కలిగి త్రిగుణాత్మికయై యున్నదని,

శ్రు||“అజ మేకాం లోహిత కృష్ణ శుక్లాం బహ్వీం ప్రజాం జనయంతీగ్ సురూపామితి ”...అని శ్వేతాశ్వతరము నందు చెప్ప బడి వున్నది. నిజజ్ఞారూప నిగామాయై నమః, శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ దూళికాయై నమః అని ఆ తల్లిని లలితా సహస్ర నామంలో కొనియాడినారు.  నాలుగు వేదములు పర దేవత యొక్క ఆజ్ఞా రూపముగా నున్నవి, కావున వేదమార్గముననుసరించి  దేవతలు శ్రిదేవి యొక్క అనుగ్రహమునకు పాత్రులు అగుచున్నారని     భావము.

అధర్వ శిరస్సు నందు “అహం బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతిః పురుషాత్మకం జగత్ “......అని శ్రీ దేవియే స్వయముగా చెప్పెను. దీనిని బట్టి సృష్టికి పూనుకోనిన బ్రహ్మమే శ్రీమాత అని తెలియుచున్నది.
“త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మేతత్”.....ఈ లోకమంతా మాయా శక్తి చేత సమ్మోహిత మగుచున్నది. మాయ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే త్రిగుణములు అని తెలియ వలెను. త్రిగుణముల యొక్క సామ్యావస్థయే (state of equilibrium) ప్రకృతి. ఆ గుణముల హెచ్చు తగ్గుల వలన, ఆ గుణముల యొక్క వైషమ్యము వలన జగత్తుగా పరినమించు చున్నది.   
త్రిమూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క గుణమునకు ప్రధానముగా గలవారని చెప్పబడి యుండుట చేత గుణత్రయము తో కూడిన మాయ, త్రిమూర్తులతో కూడిన మాయ, ప్రకృతి (అమ్మ) తురీయమగు బ్రహ్మము నే  ఆశ్రయించి ఉండును. అంటే కామేశ్వరునితో ఉండును. కామ కామేశ్వరీ రూపములో. దీనినే మైత్రాయణీ శృతి ఇలా చెప్పుచున్నది.

“ తమోవా ఇదమేక మగ్ర ఆసీత్ తత్పరే స్యాత్, తత్పరేణేరితం, విషమత్వం, ప్రయాత్యేత ద్వైరజ స్తద్రజః ఖల్వీరితం విషమత్వం ప్రయాత్యేతద్వై సత్త్వస్య రూపమ్.”.....తమస్సు లో నుంచి రజస్సు, రజస్సు లో నుంచి సత్త్వము బుట్టినది అని అర్ధం. అంటే మనము కూడా క్రింద నుంచి పైకి ఒక్కో గుణములోకి మారుతూ సత్వ గుణము వైపు ప్రయాణించాలి. గుణములతోనే మనిషి మారాలి. మనిషిని మార్చాలంటే మనస్సును మార్చాలి, అంటే అతని యొక్క త్రిగుణముల నిష్పత్తి మారాలి. తమోగుణము తగ్గి, సత్వ గుణము పెరగాలి. దీనికి పురాణ పఠనములు, భగవన్నామ సంకీర్తన అవసరము. సత్వ గుణ సంపన్నుడు ఎప్పుడు అవుతాడో అప్పుడు ఒక సాదు, ఒక ఋషి, ఒక యోగి, ఒక మహర్షి, ఒక జ్ఞాని జన్మ వస్తుంది. ఆ జన్మలో కూడా పరిపూర్ణుడు అయితే శుద్ధ సత్వం లోకి అడుగు పెడతాడు, అంటే మరో జన్మ లేకుండా మాయా ప్రకృతి బంధనాల నుంచి విముక్తి పొంది శివునిలో ఐక్యమౌతాడు.  అందువలన ఉపాధి మారాలంటే గుణములు మారాలి. మంచి ఉపాధి (జన్మ, శరీరం) కోసం, మంచి గుణాలు అలవర్చుకోవాలి. మరి సత్వ గుణములు తెలుసుకోవాలంటే సత్ సాంగత్యము చేయవలెను. సాధు పురుషుల, పురాణ పురుషుల కలియక చేత మనస్సు నెమ్మదిగా మారును.

“ఆరాధ్యా పరమాశక్తిః సర్వై రపి సురాసురైః,  మాతుః పరతరం కించి దధికం భువనత్రయే”.
పరాశక్తి సురాసురల చేత కూడా ఆరాధ్యమగుచున్నది. ముల్లోకముల యందు అమ్మ కంటే ఇతరమైనది, అధికమైనది, గొప్పదైనది లేదు.
కావున అమ్మ యొక్క త్రిగుణములకు ప్రతీకగా జనించిన బ్రహ్మాది దేవతలు నిత్యమూ అమ్మ పాదములకు నమస్కరించు చున్నారు. అమ్మ పాదములకు చేసిన పూజ త్రిమూర్తులకు కూడా చెందుతుంది. ఎందుకంటే అమ్మ పాదముల చెంత నిత్యమూ త్రిమూర్తులు కొలువై అమ్మ కు సేవ చేస్తూ వుంటారు గావున. ముక్కోటి దేవతలు నిత్యమూ అమ్మ పాదముల చెంత శిరస్సులు వంచి మ్రోక్కుతూ వుంటారు గావున, శ్రీదేవీ పూజ సకల దేవతా పూజ అగును. వేరే పూజలు అక్కర్లేదు. అందరూ ఆమె కడుపులో నుంచి వచ్చిన వారే గనుక.
శ్రు|| భీషాzస్మా ద్వాతః పవతే భీషోదేతి సూర్యః , తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సర్వ మిదం విభాతీతి.
పై శృతి వలన దేవతలు అందరూ త్రిగుణాత్మకులుగా యున్నారని, ఆ గుణ త్రయమే కోణ బిందువులు అని, ఇవియే శుక్ల, రక్త, మిశ్ర బిందువులు అని, శ్రీవిద్యా తంత్రము నందు, కామకలా విలాసము నందు వివరించబడి  వున్నది. ఈ మూడు బిందువుల చేతనే సృష్టి జరుగు చున్నది అని తెలియ వలెను.

శివ రూపం శక్తి రూపం బ్రహ్మ స్వరూప రూపకమ్,
త్రిపురాం పరమేశానీం మహా ప్రళయ సాక్షిణీమ్ ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/21-06-2014 @ శ్రీకాళహస్తి