Saturday, 21 June 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 25

సౌందర్యలహరిభాస్కర ప్రియ – 25

త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్పూజా పూజా తవ చరణయోర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తంసమకుటాః || 25 ||

ఓ శివానీ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించిన వారైన త్రిమూర్తులకు చేసే పూజ కూడా. వారికి ప్రత్యేక పూజలవసరం లేదు. ఎందుకంటే వారు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో చేరి, హస్తాలు తమ మణిమయ శిరోమకుటాలకు తాకునట్లు వహించి మొక్కుతూ, నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు. భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావం.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క గొప్పతనాన్ని  మనకు తెలియ జేస్తున్నారు.

శివా అన్నా శివే అన్నా ...శివుని రాణి అని అర్ధం...... Mrs. Siva అని అర్ధం.  వేద పురాణ కాలములోనే భార్యను భర్త పేరుతో పిలిచేవారు. ఈ సంస్కృతి మన నుంచి పశ్చిమ దేశాలకు వచ్చినది. భవాని, రుద్రాణి, ఇంద్రాణి, అని భర్త పేరు మీద భార్యలను పిలిచే వారు. అలా శంకరులు శివే అని అన్నారు.
శివే ..మంగళ ప్రదమైనది.  మంగళకర గుణములు కలది గాన శివా అని, శివే అని అందురు. శమింప జేయునది గాన శివే అని, మోక్షము ఇచ్చునది గాన శివా, శివే అని అందురు.  
శివుడెట్లో దేవి అట్లు, శివునకు దేవికి భేదము లేదు. అందుకని శివే అన్నారు. అమ్మ ఎలా మూలమైనది? ఈ సృష్టికి తల్లి అయినది కాన, ప్రకృతి ఆమె గనుక ఈ ప్రకృతి లో నుంచి జగత్తు వచ్చినది గనుక అమ్మ మంగళ కరమైనది. పూర్ణ గర్భిణి అయినది.

అయ్య పేరు మీదుగా అమ్మ పేరు. ఎంత మర్యాద? ఆడ వాళ్ళను  భర్త పేరుతో, ఇంటి పేరుతో పిలవడం ఎంతో మర్యాద. వావిళ్ళ వారు, యద్దనపూడి వారు, వింజమూరి వారు, ... ఇలా.
అలాగే ఆడవాళ్ళను వాళ్ళ భర్త పేరు మీదుగా  పిలవడం Mrs. RAO అని, మీనాక్షీ సుందరం, లలితా సుబ్రహ్మణ్యం అని కూడా.
అయ్యవారిని, అమ్మవారిని ఒకేసారి తలుచుకోవడం. మరలా వేరుగా స్మరించే అవసరం లేకుండా.

నీ వల్ల గుణ దోషమేమి, నా వల్లనే కానీ .... నా వల్లనే కానీ.... నీ వల్ల గుణ దోషమేమి.....రామా....
అని శ్రీ త్యాగరాజు కొనియాడినారు.  మనస్సు త్రిగుణ జనితమైనది. శరీరం త్రిదోషములతో కూడినది.
సత్వ, రజ, తమో గుణములతో కూడినది మనస్సు. వాత, పిత్త, కఫ దోషములతో కూడినది శరీరము. జీవుడు తన ప్రారబ్ధ  ఖర్మ చేత త్రిగుణముల యొక్క నిష్పత్తి తో జన్మ తీసుకొంటాడు. ఆ గుణ దోషముల చేత మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ గుణములను తారుమారు చేయాలంటే భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యం.

త్రిగుణాత్మికా .... సత్వ, రజ, తమో గుణములను ఆశ్రయించి ఉండునది, మూడు గుణముల స్వరూపము గలది. గుణ త్రయమునకు కారణభూతురాలైనది. మూడు బిందువుల కలయకే మూల ప్రకృతి.  అమ్మ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే త్రిగుణములతో కూడినది. సృష్టి లోని ప్రతి ప్రాణి కూడా త్రిగుణములతో ఏర్పడినదే. పుట్టినది అంటే త్రిగుణములతో కూడినది అని అర్ధము. ఎవ్వరినా ఈ మూడు గుణముల తోనే పుట్టాలి.  త్రిగుణాతీతుడు పరమ శివుడు ఒక్కడే. మిగతా వాళ్ళు అందరూ త్రిగుణములకు లోబడిన వారే.

సత్త్వాది గుణములకు నిధి వంటిది అమ్మ. సృష్టి ఆది నందు బ్రహ్మ పదార్ధము సంపూర్ణముగా వున్నది. సృష్టి ఆవిర్భావ కాలము నందు గుణ త్రయ సంయుక్తమైన అవ్యక్తము ఉత్పన్నము అయినది. కాన గుణ త్రయమునకు శ్రిదేవియే కారణభూతురాలు, స్థానభూతురాలు అని భావము. అందుకే ఆమె గుణనిధి అయినది....(లలితా సహస్రనామం).

కామ కామేశ్వరుల సంయోగ రూపమే జగన్మాత సగుణ రూపమని, “తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం”...ఇత్యాది ఋక్కుల యందు లలితా దేవి అగ్ని వర్ణము గలదని చెప్పబడెను. అరుణాం కరుణాతరంగి తాక్షీం .....అని దేవిని అరుణ కాంతితో ఎరుపు వర్ణము తో పోల్చివున్నారు.
 పుట్టుక లేని మాయ మూల ప్రకృతి ఎరుపు, నలుపు, తెలుపు వర్ణములు కలిగి త్రిగుణాత్మికయై యున్నదని,

శ్రు||“అజ మేకాం లోహిత కృష్ణ శుక్లాం బహ్వీం ప్రజాం జనయంతీగ్ సురూపామితి ”...అని శ్వేతాశ్వతరము నందు చెప్ప బడి వున్నది. నిజజ్ఞారూప నిగామాయై నమః, శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ దూళికాయై నమః అని ఆ తల్లిని లలితా సహస్ర నామంలో కొనియాడినారు.  నాలుగు వేదములు పర దేవత యొక్క ఆజ్ఞా రూపముగా నున్నవి, కావున వేదమార్గముననుసరించి  దేవతలు శ్రిదేవి యొక్క అనుగ్రహమునకు పాత్రులు అగుచున్నారని     భావము.

అధర్వ శిరస్సు నందు “అహం బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతిః పురుషాత్మకం జగత్ “......అని శ్రీ దేవియే స్వయముగా చెప్పెను. దీనిని బట్టి సృష్టికి పూనుకోనిన బ్రహ్మమే శ్రీమాత అని తెలియుచున్నది.
“త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మేతత్”.....ఈ లోకమంతా మాయా శక్తి చేత సమ్మోహిత మగుచున్నది. మాయ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే త్రిగుణములు అని తెలియ వలెను. త్రిగుణముల యొక్క సామ్యావస్థయే (state of equilibrium) ప్రకృతి. ఆ గుణముల హెచ్చు తగ్గుల వలన, ఆ గుణముల యొక్క వైషమ్యము వలన జగత్తుగా పరినమించు చున్నది.   
త్రిమూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క గుణమునకు ప్రధానముగా గలవారని చెప్పబడి యుండుట చేత గుణత్రయము తో కూడిన మాయ, త్రిమూర్తులతో కూడిన మాయ, ప్రకృతి (అమ్మ) తురీయమగు బ్రహ్మము నే  ఆశ్రయించి ఉండును. అంటే కామేశ్వరునితో ఉండును. కామ కామేశ్వరీ రూపములో. దీనినే మైత్రాయణీ శృతి ఇలా చెప్పుచున్నది.

“ తమోవా ఇదమేక మగ్ర ఆసీత్ తత్పరే స్యాత్, తత్పరేణేరితం, విషమత్వం, ప్రయాత్యేత ద్వైరజ స్తద్రజః ఖల్వీరితం విషమత్వం ప్రయాత్యేతద్వై సత్త్వస్య రూపమ్.”.....తమస్సు లో నుంచి రజస్సు, రజస్సు లో నుంచి సత్త్వము బుట్టినది అని అర్ధం. అంటే మనము కూడా క్రింద నుంచి పైకి ఒక్కో గుణములోకి మారుతూ సత్వ గుణము వైపు ప్రయాణించాలి. గుణములతోనే మనిషి మారాలి. మనిషిని మార్చాలంటే మనస్సును మార్చాలి, అంటే అతని యొక్క త్రిగుణముల నిష్పత్తి మారాలి. తమోగుణము తగ్గి, సత్వ గుణము పెరగాలి. దీనికి పురాణ పఠనములు, భగవన్నామ సంకీర్తన అవసరము. సత్వ గుణ సంపన్నుడు ఎప్పుడు అవుతాడో అప్పుడు ఒక సాదు, ఒక ఋషి, ఒక యోగి, ఒక మహర్షి, ఒక జ్ఞాని జన్మ వస్తుంది. ఆ జన్మలో కూడా పరిపూర్ణుడు అయితే శుద్ధ సత్వం లోకి అడుగు పెడతాడు, అంటే మరో జన్మ లేకుండా మాయా ప్రకృతి బంధనాల నుంచి విముక్తి పొంది శివునిలో ఐక్యమౌతాడు.  అందువలన ఉపాధి మారాలంటే గుణములు మారాలి. మంచి ఉపాధి (జన్మ, శరీరం) కోసం, మంచి గుణాలు అలవర్చుకోవాలి. మరి సత్వ గుణములు తెలుసుకోవాలంటే సత్ సాంగత్యము చేయవలెను. సాధు పురుషుల, పురాణ పురుషుల కలియక చేత మనస్సు నెమ్మదిగా మారును.

“ఆరాధ్యా పరమాశక్తిః సర్వై రపి సురాసురైః,  మాతుః పరతరం కించి దధికం భువనత్రయే”.
పరాశక్తి సురాసురల చేత కూడా ఆరాధ్యమగుచున్నది. ముల్లోకముల యందు అమ్మ కంటే ఇతరమైనది, అధికమైనది, గొప్పదైనది లేదు.
కావున అమ్మ యొక్క త్రిగుణములకు ప్రతీకగా జనించిన బ్రహ్మాది దేవతలు నిత్యమూ అమ్మ పాదములకు నమస్కరించు చున్నారు. అమ్మ పాదములకు చేసిన పూజ త్రిమూర్తులకు కూడా చెందుతుంది. ఎందుకంటే అమ్మ పాదముల చెంత నిత్యమూ త్రిమూర్తులు కొలువై అమ్మ కు సేవ చేస్తూ వుంటారు గావున. ముక్కోటి దేవతలు నిత్యమూ అమ్మ పాదముల చెంత శిరస్సులు వంచి మ్రోక్కుతూ వుంటారు గావున, శ్రీదేవీ పూజ సకల దేవతా పూజ అగును. వేరే పూజలు అక్కర్లేదు. అందరూ ఆమె కడుపులో నుంచి వచ్చిన వారే గనుక.
శ్రు|| భీషాzస్మా ద్వాతః పవతే భీషోదేతి సూర్యః , తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సర్వ మిదం విభాతీతి.
పై శృతి వలన దేవతలు అందరూ త్రిగుణాత్మకులుగా యున్నారని, ఆ గుణ త్రయమే కోణ బిందువులు అని, ఇవియే శుక్ల, రక్త, మిశ్ర బిందువులు అని, శ్రీవిద్యా తంత్రము నందు, కామకలా విలాసము నందు వివరించబడి  వున్నది. ఈ మూడు బిందువుల చేతనే సృష్టి జరుగు చున్నది అని తెలియ వలెను.

శివ రూపం శక్తి రూపం బ్రహ్మ స్వరూప రూపకమ్,
త్రిపురాం పరమేశానీం మహా ప్రళయ సాక్షిణీమ్ ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/21-06-2014 @ శ్రీకాళహస్తి

Sunday, 8 June 2014

సౌందర్యలహరి- 24 - “భాస్కర ప్రియ”

సౌందర్యలహరి- 24
శ్లో||   జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
        తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశస్తిరయతి |
        సదాపూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ
        స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః || 24||

అమ్మా,  సృష్టికర్త ఐన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు రక్షిస్తున్నాడు. రుద్రుడు విశ్వాన్ని లయింప చేస్తున్నాడు. కల్పాంతంలో మహేశ్వరుడు ఈ బ్రహ్మవిష్ణురుద్రులను తనలో లీనం చేసుకుని సదాశివతత్త్వంలో అంతర్భూతం చేస్తున్నాడు. ఇలా ఈ బ్రహాండం లయమయిపోతోంది. తిరిగి సదాశివుడు కల్పాదిలో నీ కనుబొమ్మల కదలికలను  ఆజ్ఞగా గ్రహించి యీ నాలుగు తత్త్వాలతో మళ్ళీ యథావిధిగా బ్రహ్మాండ సృష్ట్యాది కార్యాలు జరిపిస్తూన్నాడు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు విశ్వ పాలకుల నిర్ణయాధికారములను, అమ్మ యొక్క సామ్రాజ్ఞిత్వాన్ని మనకు తెలియ జేస్తున్నారు.

పంచకృత్యపరాయణ.....అని లలితా సహస్ర నామంలో అమ్మ కు పేరు గలదు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అను పంచ విధములైన కృత్యములను అమ్మ నిర్వహిస్తూ వుంటుంది. అంటే బంధ మోక్షములు పరదేవతాధీనములు.
సృష్టి అనగా జగన్నిర్మాణము, అది రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని (బ్రహ్మ) ఆధీనము. అట్టి సృష్టిని మూల ప్రకృతి రూపమున చేయు చున్నది గాన ఆమెకు సృష్టికర్త్రీ అని పేరు.

గోప్త్ర్యై నమః .... గోపమనగా జగత్ సంరక్షణము . ఇది సత్వ గుణ ప్రధానము.  ఈ ఈశ్వర కృత్యమును విష్ణు రూపములో నిర్వహిస్తున్నది గాన గోప్త్రీ అని అన్నారు. రక్షణ చేయుట, పాలన చేయుట.

సంహారిణ్యై నమః ...... జగత్తును లయము చేయుట. ఇది తమో గుణ ప్రదానుడైన రుద్రుని రూపములో అమ్మ ఈ ఈశ్వర కృత్యమును జేయుచున్నది గాన సంహారిణి అని అన్నారు.

తిరోధానకర్యై నమః .....సకల సృష్టిని పరమాణువుతో సహా నాశనము చేసి బీజ రూపములో తన దగ్గర ఉంచుకోనునది గాన తిరోధానకరీ అని అన్నారు. జీవులకు తమ స్వ స్వరూపము కూడా తెలియకుండా చేయడము తిరోధానము.  శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుని రూపములో అమ్మ ఈ కృత్యమును నిర్వహిస్తున్నది.

అనుగ్రహదాయై నమః ....... బీజ రూపములో, సూక్ష్మ రూపములో వున్న సృష్టిని విస్తరించడానికి, వికసనము గావించడానికి  సదాశివ రూపములో అనుగ్రహించే కృత్యమును నిర్వహించునది గాన అనుగ్రహదా ..అయినది.

ఈ ఐదు కృత్యములను నిర్వహిస్తున్నది గాన ఆ తల్లి పంచ కృత్య పరాయణ అయినది. Flow of electrons అనేది పంచ కృత్యపరాయణత్వము. జగత్తు కదలడం పంచ కృత్యపరాయణత్వము. పంచ కృత్యపరాయణత్వము వలెనే కదలిక జరుగుచున్నది.   నిత్యమూ మన శరీరములో, ఈ సృష్టిలో జరిగేది పంచ కృత్యపరాయణత్వము. ఈ ఐదు కర్మలు ప్రతి జీవిలో, ప్రతి చోట ఈ బ్రహ్మాండము లో జరిగే పరిణామ క్రమము. ఇది recycling system.
ఐదు మంది బ్రహ్మలు, మూల అధికారులు. వారిలో మూల ప్రక్రుతియై మూల శక్తియై నడిపిస్తున్నది అమ్మ.
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు...పంచ బ్రహ్మలు, పంచ కృత్యములను నిర్వహిస్తున్నారు.  ఈ ఐదు శక్తులకు మూలము అమ్మ. అమ్మ అంటేనే కదలిక.
యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా ...నమస్తస్యై... నమస్తస్యై...   నమస్తస్యై నమో నమః.
 మూల శక్తి  (SUPREM POWER).  ఇక్కడ ఆచార్యుల వారు మనకు organization chart ఇచ్చారు.

సా విశ్వం కురుతే కామం సా పాలయతి పాలితం. కల్పాంతే సంహారత్యేవ. త్రిరూపా విశ్వమోహినీ....దేవీ భాగవతం.
నిర్విశేష మపి బ్రహ్మ స్వస్మిన్మాయా విలాసతః
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ  సదాశివః........ ....త్రిపురా రహస్యం

ఒక సారి పరశురాముడు దత్తాత్రేయుల వారితో ...”అయ్యా తమరు చెప్పుచున్న ఆ త్రిపురాదేవి ఎవరు? ఆమె గుణములు, శక్తి ఏమిటి అని ప్రశ్నించగా .. దత్తాత్రేయుల వారు ఇలా చెప్పు చున్నారు.
రామా, ఆమెను తెలుసుకోనటకు ఎవరి శక్యము కాదు. ఆమె చిచ్ఛక్తి. ఒకసారి ఇంద్రాది దేవతలు కలహించుకొని తమలో అధికులు ఎవరో తెలుపమని విష్ణువు ను అడిగిరి. విష్ణువు శివుణ్ణి అడగ్గా, శివుడు ఆ పరమేశ్వరిని ప్రార్ధించెను. ఆమె భయంకర మైన శబ్దముతో, కోటి సూర్య సమాన కాంతులతో కనబడగా త్రిమూర్తులు ఆమెకు ప్రణమిల్లి బహు విధములుగా స్తోత్రము చేసిరి. దేవతలు అందరూ మూర్చిల్లిరి. వారిని అనుగ్రహించుట కొరకై త్రిపుర సుందరీ రూపము బొందెను. ఇంద్రుడు “ఆమె ఎవరో, ఆమె శక్తి ఏమిటో” కనుగొని రమ్మని అగ్ని మొదలగు వారిని ఆమె వద్దకు పంపెను.  తన వద్దకు వచ్చిన అగ్నిని చూచి, ఒక గడ్డి పరకను చూపి చేతనైనచో దీనిని కాల్చుము అని త్రిపుర సుందరి అనెను.
అగ్ని దానిని కొంచెము కూడా కాల్చలేక వెను తిరిగెను. వాయువు కూడా దానిని కదలింప లేక మరలి వచ్చెను. చివరకు ఇంద్రుడు తన వజ్రాయుధముతో బయలు దేరేను. తన వద్దకు వచ్చు చున్న ఇంద్రుణ్ణి చూచి అమ్మ ఒక్క చిరు నవ్వు నవ్వెను. ఇంద్రుడు స్తంభించి పోయెను. దేవతలు అందరూ గురువైన బృహస్పతిని వేడుకొనెను. సత్యమును గ్రహించిన బృహస్పతి ఆ త్రిపుర సుందరిని ప్రార్ధించగా ఆ తల్లి తిరిగి దేవతలకు పూర్వ స్థితి కల్పించి ఇట్లు అనెను.

“ మీరు గర్వమును అహంకారమును వీడండి. మీరు ఎవ్వరూ అధికారులు కారు. ఈ జగత్తు అంతయూ నా శక్తి వలననే సృష్టి స్థితి లయములను పొందు చున్నది. నేనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి జగత్కార్యము నందు నియోగించితిని. కావున మీరు అందరూ త్రిమూర్తులకు లోబడి నా శాసనము అనుసరించి భక్తితో జగత్తు యొక్క కార్యమును నిర్వహింపుడు... అని పలికి ఆ పరమేశ్వరి అంతర్ధానము పొందెను.  ........దేవీభాగవతం/త్రిపురా రహస్యం..

 స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః   .........

క్షణచలితయో.....క్షణ మాత్రమున చలించిన .... అంటే నీ కను సైగల ఆధారముగా, ఆజ్ఞగా, ఆనతి గైకొని  త్రిమూర్తులు పని చేస్తున్నారు. ఎందుకంటే అమ్మా నీవు “ఉన్మేషనిమిషోత్పన్న విపన్న భవనావళీవి.
కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం. కన్ను మూసి తెరిచే లోపల బ్రహ్మాండములు పుట్టి నశించు చున్నవి. నీ సంకల్ప మాత్రము చేతనే సృష్టి, వినాశనములు జరుగుచున్నవి. సృష్టి, స్థితి, ప్రళయములకు కారణ భూతురాలివి నీవే గదమ్మా.  సంకల్ప వికల్పములకు మూల శక్తి ఆ మహా మాయయే కారణం.

శ్లో|| గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి  శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
      సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై  తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/08-06-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/sribhaskaranandanatha/

http://vanadurga-mahavidya.blogspot.in/     

Wednesday, 4 June 2014

సౌందర్యలహరి- భాస్కర ప్రియ - 23

సౌందర్యలహరి- 23

త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటమ్ || 23 ||

ఓ భగవతీ ! నీవు తొలుత శంభుడి శరీర వామభాగాన్ని అపహరించి  తనివితీరని మనస్సుతో ఆయన  తక్కిన సగం కూడా గ్రహించావని నాకు తోచుచున్నది. ఏలనన నా హృదయంలో విరాజిల్లుతున్న నీ దివ్యశరీరం ఉదయభానుడి కాంతితో సాటివచ్చే కెంపుకాంతులతో ఒప్పారుతూ, పాలిండ్ల జంటచే యించుక ముందుకు వంగినట్లు కనబడుతూ, మూడు కన్నులు కలిగి, వంపు తిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్నకిరీటంతో సొంపారుతూ, విరాజిల్లుతుంది.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు చెబుతున్నారు. అర్ధనారీశ్వర స్వరూపాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు.

అదేమిటి అమ్మా, అర్ధనారీశ్వర స్వరూపములో మొత్తం రెండు ప్రక్కల కుడి ఎడమల నీ రూపమే కనిపిస్తున్నది. మొత్తం శంభుని శరీరాన్ని పూర్తిగా నీవే ఆక్రమించినావు. చిన్నగా స్వామి వారి యొక్క వామ భాగాన్ని అపహరించినావు, అది చాలదన్నట్లు ఆయన కుడి భాగాన్ని కూడా అతి లాఘవముగా లాగు కొన్నట్లుగా  నాకు సందేహము కలుగుతున్నది.
ఎందుకంటే నీ అరుణ కాంతి ఆయన ధవళచ్చాయ మీద పడి అది కూడా ఎరుపుగా కనిపిస్తున్నది. మొత్తం రెండు వైపులా ఎర్ర రంగుతో రెండు వైపులా నీవే కనిపిస్తున్నావు. ఒక ప్రక్క పురుష రూపం తో ఉండాల్సిన శరీరం రెండు వైపులా స్తన ద్వయం తో ముందకు వంగి నట్లుగా కనిపిస్తున్నది. మరి ఆ మూడో కన్ను నీ ముఖ తిలకం లాగ కనిపిస్తున్నది. అమ్మా,  ఎక్కడా అయ్యవారి చాయలు కనిపించడం లేదు, నీ సౌందర్యం తో ఆ శంభున్ని దాచేసినావు గదమ్మా. ఎంత గడుసరి దానివి గదమ్మా నీవు. పాపం మా అయ్య ఉనికిని కూడా నీవు లాగేసుకోన్నావు గదా తల్లీ.
అమ్మ యొక్క గడుసు తనాన్ని ఇక్కడ చాలా తమాషాగా వర్ణించినారు. పాపం మా తండ్రిని (శంభుని) అమాయకుణ్ణి చేసి మొత్తం నీ అరుణ కాంతితో ఆయన్ను పూర్తిగా కప్పెసినావు గదా తల్లీ. 

శ్రీవిద్యాం శివ వామభాగ నిలాయాం, హ్రీంకార మంత్రోజ్వలాం.......
అర్ధనారీశ్వర తత్వాన్ని ఉపాసన చేయడం యోగ శాస్త్రములో చాలా గొప్ప విషయము. కుండలినీ సాధకులు ఈ స్వరూపమును నిత్యం సాధన చేస్తూ వుంటారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి. ప్రతి అణువులోనూ స్త్రీ పురుష సమ్మేళనము వున్నది, అర్ధనారీశ్వర తత్వం వున్నది. ఈ తత్వాన్ని అర్ధం చేసుకోనిదే సహస్రారము చేరలేరు. స్త్రీ పురుష భేధమును చూచే వారు సుధా సింధువును చేర లేరు. అమ్మలో అయ్య, అయ్యలో అమ్మను చూడ గలిగే శక్తికి ఎదగాలి. ప్రతి అణువులో శివ శక్త్యైక్య స్వరూపాన్ని చూడగలగాలి.  స్త్రీ పురుష రూపములు మిళితమైన ఏకైక రూపాన్ని ఆరాధించాలి. అర్ధం చేసుకోవాలి.  అదే నిర్గుణ స్వరూపము.
పంచదశీ మహా మంత్రము నుంచి అమ్మను కామ కామేశ్వర స్వరూపముగా అర్ధనారీశ్వర తత్వముగా ధ్యానించాలి.
చాంపేయగౌరార్ధశరీరకాయై - కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ - నమః శివాయై చ నమః శివాయ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై - స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ ||

శం సుఖం భవ త్యస్మాత్ శంభుః – శం అనగా సుఖము. ఎవరి వలన ఈ సుఖము కలుగునో అతను శంభువు.  నిత్యం పరమానంద రూపములో గలవాడు శంభువు. నిత్యం సుఖ రూపియై యుండు వాడు శంభువు. పర బ్రహ్మము నకు శంభు అని పేరు కూడా గలదు. నిజ సుఖము బ్రహ్మానంద స్వరూపము. మిగతా సుఖములు విషయ సుఖములు. ఇవి వస్తు సంబంధములు, అనిత్యములు.
శంభుడి అర్ధ శరీరాన్ని లాగేసుకోవడం అంటే బ్రహ్మానందాన్ని గ్రప్పివేయుట, మరుగున పరుచుట. శాశ్వతమైన సుఖాన్ని మాయతో మరుగున పరుచుట. స్వ స్వరూపము తెలుసుకోక పోవడం అవిద్య.
బ్రహ్మానంద స్వరూపమును (తెలుపు) మరుగున పరుచునది మాయ (ఎరుపు) అని ఎరుగ వలెను.

గూడార్ధము :-
అమ్మ అంటే ప్రకృతి, అవిద్య. మాయ, అజ్ఞానము, అరుణ కాంతి, ఎరుపు రంగు అంటే మాయ. రజో గుణము.
తెలుపు స్వచ్చతకు, సత్వ గుణమునకు, శుద్ధ తత్వాన్నికి, జ్ఞానానికి, విద్యకు చిహ్నములు. అవిద్య విద్యను కప్పుతుంది. అజ్ఞానము జ్ఞానాన్ని, విద్యను  మరుగున పడేటట్లు చేస్తుంది. భ్రమింప జేస్తుంది. తెలుపు రంగు ఎరుపు రంగు చాటున,  వెనుకాల దాగి వుంటుంది.
 మాయ (ఎరుపు) సంసారంలోకి లాగుతుంది. మొహం కలుగ జేస్తుంది. వున్నది అంతా ఎరుపే అనేటట్లు చేస్తుంది. రెండు వస్తువులు ఉన్నట్లుగా కల్పన చేస్తుంది.
మాయ చేత మావి చేత జీవుడు సదా గ్రప్పబడి ఉంటాడు. ఇదే ప్రపంచం, ఇదే సర్వస్వం, నేను, నాది అనుకోవడమే అరుణ కాంతి. ఎర్రని కాంతి చేత సమ్మోహింప బడి ఉంటాడు జీవుడు ఎప్పుడూ. అది అమ్మ లీల. అమ్మ మాయ. అదే విష్ణు మాయ.
అమ్మా ఎంతటి వాడ్ని అయినా సరే నీ మాయలో పడేస్తావు కదా తల్లీ.
అమ్మ అనుగ్రహముతోనే ఆ దేవీ మాయను వీడి, ఆ అరుణ వర్ణాన్ని వీడి శుద్ధ తత్వాన్ని (తెలుపు) పొందాలి. అజ్ఞానాన్ని వీడి జ్ఞానాన్ని పొందాలి అంటే అమ్మ యొక్క కరుణ వుండాలి. అప్పుడే శంభున్ని చూడ గలము. మాయ వీడితేనే జ్ఞాన జ్యోతి కనబడ గలదు. మాయ అమ్మ, జ్ఞానము అయ్య.
ప్రకాశ బిందువును విమర్శ బిందువు సదా ఆవరించి వుంటుంది.

ఓకే రూపంలో, ఒకే శరీరంలో స్త్రీ పురుషులు వున్నారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. వున్నది ఒక్కటే.
న శివేన వినా దేవీ దేవ్యా చ న వినాశివః
నై తయోరంతరం నాస్తి చంద్ర చంద్రిక యోరివః

అయ్య లేనిదే అమ్మ లేదు, అమ్మ లేనిదే అయ్య లేడు. ప్రకాశ విమర్శ బిందువులే స్త్రీ పురుష రూపములు. శివ శక్తులు. శివశివాని. అదే శ్రీచక్రము. ఈ తత్వాన్ని అర్ధం చేసుకొన్నవాడు సౌందర్యలహరిని అర్ధం చేసుకోగలడు.
సకల భువనోదయ స్థితి లయ మయ లీలా వినోద నోధ్యుక్తః
అంతర్లీన విమర్శః పాతు మహేశః ప్రకాశ మాత్ర తనుః ........కామకలావిలాసము

శ్రు|| యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్టితః,
       తస్య ప్రకృతి లీనస్య యః పర స్స మహేశ్వరః ||
ఆ పురుషునిలో ప్రకృతి (స్త్రీ) లీనమగుచున్నది. ప్రకృతిని తొలిగిస్తే వుండేది పరమాత్మ.

యద్య త్కర్మకరోమి తత్వదఖిలం శంభో తవారాధనం.....
  
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ....

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/04-06-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/sribhaskaranandanatha/
http://vanadurga-mahavidya.blogspot.in/