Sunday 5 January 2014

నాయన - శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని జీవిత చరిత్ర



నాయన - శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని జీవిత చరిత్ర-దీనిని రచించిన వారు శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారు. 

నాయన - భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి ముఖ్య శిష్యులలో ప్రధమముగా చెప్పుకోవలసిన వారు. 

శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 17-11-1878 లో జన్మించిరి.

వీరు తమ పదియేండ్ల వయసు నందే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదము నందు అసమాన ప్రతిభ చూపినారు.

వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని 'కావ్యకంఠ' బిరుదమును పొందిరి.

వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు. 

అయినను ఇంకా సంతృప్తి పడక - ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి '....... తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను.... ' అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:

1. " 'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు. 

2. జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.

గణపతిముని వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక' అని పలికెను. 

'సరే, నాయనా' యని రమణుడు దానిని స్వీకరించెను.

అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి.

తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి (1922 వేసవి).

గణపతిముని ఉమా సహస్రము, శ్రీ రమణ గీత, శ్రీ రమణ చత్వరిమ్సత్, ఇంద్రాణి సప్తశతీ, మహా విద్యాది సూత్రావళి, గీతమాల, విశ్వమీమాంస, మొదలగు గ్రంధములను రచించెను. మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షి సంస్కృతములో రచించిన 'ఉపదేససారము' నకు వ్యాఖ్యానము రచించిరి.

'నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని 25-07-1936న తమ భౌతిక శరీరమును వీడిరి. 

ఈ దివ్యపురుషుని భౌతిక దేహమంతరించినను, తన గ్రంధములందు బోధరూపమున ప్రకాశించుచున్నారు.

నాయన కలకత్తా కి 24-11-34 న వచ్చి శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారి ఇంట్లో బస చేసితిరి. వీరి ఆదరాభిమానములకు సంతసించి, నాయన షుమారు ఒకటిన్నర సంవత్సరములు కలకత్తా లో వీరి దగ్గర వుండిరి. ఆ సమయములో ప్రతిరోజూ నాయన వీరికి అనేక ముఖ్య విషయములను బోధించెడివారు.. ముఖ్యముగా లక్ష్మికాంతము గారి కోరిక మేర నాయన గారు స్వయముగా తమ జీవిత చరిత్ర, ఉమా సహస్రము నకు అర్ధము మరియు వ్యాఖ్యానము,ఇంద్రాణి సప్తశతీ యొక్క అర్ధము మరియు వ్యాఖ్యానము, విశ్వమీమాంస వివరణము, మొదలగు విషయములు బోధించిరి. గణపతి ముని గారు (వీరనారి సత్యప్రభ అను కథను) 'పూర్ణ' అని సంస్కృత భాష యందు వ్రాసి, 'పూర్ణ' అని తెలుగులో వ్రాసిరి. (ఈ కథను భారతి పత్రికలో అచ్చు వేసిరి).

గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు. 

భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. 

ఈ జీవిత చరిత్ర మొదట 1958 లోను, తదుపరి 1964,1998,2001 మరియు 2013 ప్రచురింపబడినది.

వేల రూ 250/- + Postage. ప్రతులకు jvslakshmi@gmail.com సంప్రదించండి. ధన్యవాదములు

 

​Phone:-  09840119425​


--

మీ

శ్రీ భాస్కరానంద నాథ

 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.