Sunday 27 April 2014

సౌందర్యలహరి- 2

సౌందర్యలహరి- 2

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్‌ విరచయతి లోకా నవికలమ్‌ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్‌ ||


ఓ మాతా! బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాటి వైకల్యం లేకుండ సృజిస్తూన్నాడు. ఈ ఇంచుకపదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో కష్టముతో  మోయుచున్నాడు . కొసరంత నీ పాద ధూలినే శివుడు చక్కగామొదిపి తన శరీరానికి విభూతిగా అలదు కొంటున్నాడు.

అమ్మా, నీ పాద కమలముల యొక్క పుప్పొడిని (పాదాబ్జ రేణువు), పాద రజస్సు లో లేశమాత్రముగ్రహించి, ఆ శక్తితో బ్రహ్మ దేవుడు సృష్టి కార్యము చేస్తున్నాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వికల్పము  రాకుండా. ఈ స్థావర జంగమాత్మక మైన ప్రపంచాన్ని, ఈ పదునాలుగు లోకాలను నీ శక్తితో చాలా సునాయాసంగా రచన చేయుచున్నాడు. నీ పాద రజస్సునే కించుక శిరస్సున ధరించి శ్రీ మహావిష్ణువు ఆది శేషు రూపములో ఈ పదునాలుగు భువనములను మోయుచున్నాడు గదమ్మా. అదే పాద ధూళిని తన శరీరానికి విభూతిగా పూసుకొని ప్రళయ కాలము నందు హరుడు సమస్త లోకములను లయము చేయుచున్నాడు గదా తల్లీ.
అంటే ఈ మూడు కార్యములను సృష్టి, స్థితి, లయములను త్రిమూర్తుల రూపములలో ఆ తల్లే చేయుచున్నది అని అర్ధము.
గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ,
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరానంద నాథ









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.