Sunday 10 June 2012

శ్రీవిద్య – శ్రీచక్రము-4


శ్రీవిద్య శ్రీచక్రము
PART – 4

భక్తుడు ధాన్యం చేసుకోవడానికి ఒక రూపం కల్పించబడ్డది. మరి ఆ రూపానికో నామం, ఆ నామరూపాలకో నివాస స్థానం. ఇవన్నీ ఎందుకంటే భక్తుడు భగవంతున్ని కూడా తనతో పోల్చుకొంటాడు.
తనలాగే నామరూపాలు నివాసం ఉంటాయనుకొంటాడు. తన లాగే వేష భాషలుంటాయని తలపోస్తాడు.
తన లాగే భగవంతునికి కూడా సంసారం వున్నదని అనుకొంటాడు. తనకు ఇష్టమైన పదార్థాలు అన్నీ భగవంతుడికి కూడా ప్రీతికరమైనవిగా భావిస్తాడు.
 ప్రతి జీవీ భగవంతుడు తన లాగే వుంటాడని నమ్ముతుంది. ఒక శునకాన్ని భగవంతుడు ఎలా వుంటాడని ప్రశ్నిస్తే, తన లాగే శునక రూపం లో వుంటాడని చెబుతుంది.

మొదట్లో ఒక నామాన్ని, రూపాన్ని, ఒక స్థానాన్ని తన అభీష్టానికి అనుగుణంగా భావించుకొని ధ్యానం చేయవచ్చు. కానీ అదే శాశ్వతంగా చేసుకోకూడదు. భగవానుని పై వున్న భక్తిని అనుసరించి ధ్యానాన్ని అభ్యసించాలి. అంటే చూసే ప్రతి వస్తువు ను భగవత్స్వరూపంగా ధ్యానం చేయాలి. అన్ని రూపాలలో, అన్ని దేవతలలో, అన్ని స్థానాలలో మన  ఇష్ట దైవాన్ని చూడగలగాలి. అన్ని రూపాలూ ఒకటేనని గాడంగా నమ్మాలి. తత్వం ఒకటేనని నమ్మిక రావాలి.

ఒకే బంగారం వివిధ ఆభరణాలలో వున్నట్లు, ఒకే పర బ్రహ్మం వివిధ రూపాలలో కొలువై వున్నది.
దైవం ఒక్కడేనని, అనేక నామరూపాలు భక్తుల సౌకర్యము కోసమే ధరిస్తాడని, వాటిల్లో ఏ నామరూపాలతో ధ్యానించినా ఆ పరమాత్మ కరుణిస్తాడని తెలుసుకోవాలి. శైవులు లింగాకారాన్ని ప్రార్ధిస్తారు.  అదే వైష్ణవులు నవరత్న ఖచితమైన ఆభరణాలతో అలంకరించిన శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఇరువురిని ఒక్కటిగా చూచి, కొలిచే వాడే యోగి. ఎందుకంటే ఆ ఇద్దరిలోనూ వున్న నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్నే యోగి చూస్తాడుగనుక.  లింగ భేదాలు శబ్దాన్ని బట్టి కలిగాయే గాని, వస్తువును బట్టి గాదు. లింగ భేదం గాని, నామ రూపాలు గాని సగుణ బ్రహ్మనికే గాని నిర్గుణ పరబ్రహ్మానికి కాదు.
కాబట్టి ఎవరికి ఏ రూపం, ఏ నామం ప్రియంగా వుంటుందో, అతడా నామరూపాలలో ఆ పరబ్రహ్మమును కోలుచుకోవచ్చు.  ఆ స్థాయికి భక్తుడు ఎదగాలి. తన భక్తి శ్రద్ధలను బట్టి, విశ్వాసమును బట్టి తను కొలిచే రూపములోకి ఆ పరబ్రహ్మ స్వరూపము ఆకర్షించబడును. భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి, ఏ దేవతను కొలిచినా, చివరకు రాయి, రప్ప, చెట్టు, పుట్ట దేనినైనా సరే, భగవంతుడు పలికి తీరుతాడు. నమ్మకం ముఖ్యం.

ఆకారం వున్న వస్తువులన్నీ ఆ మహా ప్రకృతిచే సృష్టించబడ్డవే. పుట్టిన వాళ్ళందరూ కర్మ బద్దులే. కాబట్టి త్రిమూర్తులు కూడా ఆ ప్రకృతికి పుత్రులేనని తెలుస్తుంది. అందువల్లనే శక్తిని ఉపాసించేవారిని యోగులన్నారు. మార్గం  ఏదైనా, పరిపక్వత చెందితే గానీ భగవదనుగ్రహం కలగదు.  కాబట్టి ఏ దేవతను ఉపాసించినా ఆ దేవతకన్నా భిన్నమైనదేదీ లేదన్న భావనతో ఉపాసించాలి. అప్పుడే పూర్ణ ఫలం లభిస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యములు లేకుండా, ఏ ఉపాసన చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

నిర్గుణ పర బ్రహ్మం తప్ప మిగిలిన వారంతా మాయాశక్తి అయిన ప్రకృతి చేత సృష్టి౦చబడ్డ వాళ్ళే. కాబట్టి ముందుగా మూల ప్రకృతిని, ఆ పర దేవతను ఉపాసించి, ఆమె అనుగ్రహానికి పాత్రులై, ఆ పరమాత్మ కరుణకు పాత్రులు కావాలన్నదే శ్రీవిద్యోపాసకుల భావం.

మంత్రమంటే శ్రీచక్రమని, శ్రీచక్రములో సర్వ దేవతలుంటారని, ఒక్క పరబ్రహ్మం తప్ప మిగిలిన దేవతలంతా
కూడా త్రిమూర్తులతో సహా ఆ దేవిని సేవిస్తూ వుంటారని, త్రిమూర్తులకు కూడా ఆమే తల్లి యని,  శ్రీచక్రములో ముక్కోటి దేవతలను భావించుకుంటూ, అందులోని బిందు స్థానాన్ని ఆ పరదేవతగా ధ్యానిస్తూ, శ్రీ శంకరభగవత్పాదుల చే పరిష్కరించబడి వేదోక్త విధి విధానములతో చేయబడే శ్రీ విద్యా తంత్రమును, దక్షిణాచారమని   అంటారు. కరచరణాదులతో గూడిన సగుణ బ్రహ్మాన్ని, లేదా తద్దేవతా యంత్రములను, షోడశోపచారములతో, ధూప,దీప,నైవేద్యములతో  పూజించడాన్ని బహిర్యాగమందురు.

మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ రూపమైన ఆ శ్రీమాతను, ఆ పరదేవతను ఆరాధించి కొలవడమే శ్రీవిద్యోపాసన. త్రిమూర్తులను త్రిశక్తులను సృష్టించిన శ్రీమాత ఆమె. సర్వ సృష్టికి మూలాధారమైన ఆ ఆదిశక్తి మన తల్లి.  ఒకప్పుడు ఆమెను దేవతలందరూ అమ్మా నీవు ఎవరు ? అని అడుగగా,
నేను బ్రహ్మస్వరూపిణిని, నా వలననే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించుచున్నది ...అని చెప్పినది. అందుకే ఆమె బ్రహ్మ విష్ణు శివాత్మికా .. అని, శివ శక్త్యైక్య రూపిణీ లలితాంబికా, .. అని,  పిలవబడుచున్నది. మూడు గుణములకు ప్రతి రూపమైన  త్రిమూర్తులకు తల్లియై, వారికి కూడా శక్తిని ప్రసాదిస్తూ త్రికోణా౦తర దీపికా గా తన ప్రభలను ప్రభవిస్తూ వున్నది. బ్రహ్మాండము లన్నింటికీ శక్తిని ఇస్తూ, సమస్త గ్రహములను నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమణ చేయుస్తూ, అవి పడిపోకుండా నిలుపుదల చేసిన మహాశక్తి  మన తల్లియే. మన పెద్దమ్మే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.

ప్రకృతితో కలిసి ఉండకపోయినట్లయితే పరమేశ్వరుడు కూడా దేహాన్ని ధరించలేడు. రాగితో కలవనిదే బంగారము ఆభరణము కాదు. కాబట్టి ధర్మ రక్షణ కోసం నిర్గుణ పరబ్రహ్మం, సతితో కలసి  సగుణాన్ని స్వీకరిస్తాడు. అప్పడు రూపం ఏర్పడుతుంది. తన మహాత్త్వాన్ని లోకానికి చాటి చెప్తూ అధర్మాన్ని సంపూర్ణంగా నిర్మూలించి అటు పైన ఆ రూపాన్ని వదిలేస్తాడు.  ఈ రూపాన్నే మనము  అర్చనా పరంగా ఆరాధిస్తాము. అటువంటి రూపాలనే మనము అవతరాలని అంటూవుంటాం. 

దేవతల యొక్క శక్తి వాని మంత్రములయందు, మంత్రముల యొక్క శక్తి వాని బీజముల యందు నిక్షిప్తమైయున్నట్లు, ఆయా దేవతల తత్వమంతయు సంక్షిప్తముగా ఇమిడియుండుటచేత ఆయా దేవతల మంత్రములు ఆయా దేవతల సూక్ష్మ రూపమని అందురు. ఇట్టి సూక్ష్మరూపమును జపాది రూపమున మానసికముగా, భావనాపరంగా  చేయు క్రియను  అంతర్యాగము  అని అందురు.
మానసికంగా చేసే ప్రతి పూజా అంతర్యాగము  అగును. 
బాహ్యముగా చేసే శ్రీచక్రార్చనను అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే, బ్రహ్మగ్రంధి, విష్ణు గ్రంధి, రుద్రగ్రంధిని చేధించి సహస్రారమును  చేరే యాగమును అంతర్యాగము  అని అందురు.

శ్రీ శంకర భగవత్పాదులకు గురువైన శ్రీ గౌడపాదాచార్యులు విరచించిన శ్రీ విద్యా సూత్రముల గురించి,
మానవ శరీరములోని షట్చక్రములు అందలి దేవతలు, శ్రీచక్రమునకు గల ఐక్యత, సంబంధము గురించి,
కుండలినీశక్తిని గురించి, మరో టపాలో తెలుసుకొందాము.
మంత్ర, తంత్ర, యంత్ర, శాస్త్రములను, పాఠములను  గురు ముఖతః తెలుసుకోవలెను, 
గావున ఇచట చర్చించుట లేదు.................. సశేషం.

నమస్కారములతో

మీ
భాస్కరానందనాథ
(కామరాజుగడ్డ రామచంద్రరావు)

 శ్రీగురుభ్యోనమః శ్రీమాత్రేనమః
మహా పురాణములన్నియు శివుని గాని, విష్ణువుని గాని పరమ దైవతముగా ప్రతిపాదించు చున్నవి.
శ్రీదేవీ భాగవతము శ్రీశక్తి తత్త్వమును పరమార్ధ తత్త్వముగా ప్రతిపాదించుచున్నది. ఈ శక్తి తత్త్వము
పరమాత్మ తత్త్వములో అవిభాజ్యమగు ఇచ్ఛా శక్తి రూపమైనది. కావున శివ కేశవుల భేద భావనకు నే మాత్రము
నాస్పదము గాని పరమాత్మ తత్త్వమే  శ్రీ దేవీ భాగవతములో కూడా ప్రతిపాదించబడినది.

పురాణములు గుణ భేదము ననుసరించి సాత్త్విక, రాజస , తామస భేదమున విభజింపబడినట్లు సంప్రదాయజ్ఞులు చెప్పుచున్నారు. ఈ విషయమున గ్రహింపబడిన గుణ త్రయము పరమాత్మ సృష్టి స్థితి లయములను నిర్వహించుటకై మూర్తి త్రయమందు నిలిపిన ప్రవృత్తి, నివృత్త్యానంద రూపములగు గుణత్రయమే గాని సుఖ, రాగ, మోహ రూపములగు లౌకిక సత్త్వరజస్తమో గుణములు కావు. గుణ త్రయముల నుంచి వచ్చిన త్రిమూర్తులకు, దోషములను ఆపాదించి తక్కువ చేసి మాట్లాడటము సబబు కాదు. విధి నిర్వహణలో ఆయా గుణములతో, ఆయా రూపములతో ఆ పరమాత్ముడు చేసే విన్యాసములు. సృష్టి,  స్థితి యెంత ముఖ్యమో లయము కూడా అంతే  ముఖ్యము ఈ సృష్టిలో.

పురాణములకన్నిటికి కర్త అయిన శ్రీ వేదవ్యాస మహాముని చే  శ్రీదేవీ భాగవతము కూడా ప్రవచించబడినది... అన్నది గురు వాఖ్య, రుషి  వాఖ్య, లోక వాఖ్య. శ్రీదేవీ భాగవత మహా పురాణము పుణ్యకరమైనది,
ఉత్తమోత్తమమైనది. ఇందు పదునెనిమిది వేల శ్లోకములు గలవు. పండ్రెండు స్కంధములు, మూడువందల పదునెనిమిది యధ్యాయములు గలవు. దీనిని శ్రీ వ్యాస భగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. ఇది సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితమునను నైదు  లక్షణములతో ఒప్పారుచున్నది.

శ్రీ  వేదవ్యాస మహాముని శ్రీ మహాభారతమును రచించెను. అది వేదసారము, పంచమ వేదముగా
కొనియాడబడినది. అష్టాదశ మహా పురాణములలో మహాభారతము లేదని, అందువలన దానిని శ్రీ వ్యాసుల వారు
విరచించలేదు....అని అంటే ఎట్లాగ? దేనినైనా మన పూర్వీకులు, పెద్దలు చెప్పిన మాటలను విశ్వసించాలి.
శ్రీ దేవి భాగవతము కూడా శ్రీ వేద వ్యాస మహర్షి చే రచించబడినది. అలా కాదు అనిన పక్షములో మిగతా అష్టాదశ పురాణముల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారవా? ఎందుకంటే వేటికీ ఇప్పుడు చూపించే ప్రమాణము లేదు గనుక. మన వేదములు పురాణముల పట్ల మన విశ్వాసమే ప్రమాణము. ఏ ప్రమాణములు లైతే శ్రీ వేదవ్యాసడు
అష్టాదశ మహా పురాణములకు కర్త అని ఘోషించినవో, అవే ప్రమాణములు శ్రీ దేవిభాగవతమును కూడా
శ్రీవేదవ్యాసడే రచించినాడు అని చెప్పినవి. ఇటువంటి సంకుచిత భావాలతో భగవంతున్ని చింతన చేయడము పాపము అవుతుంది. సర్వవ్యాపకుడైన భగవంతున్ని ఒక మూర్తికే పరిమితము చేయడము ఎంత వరకు సబబు? అన్ని రూపాలూ ఆయనివే.

రాముడు విష్ణువు అని ఆరాధించే భక్తులకు ఏ ఫలము దక్కుతుందో, రాముడు శక్తి అని నమ్మేవారికి కూడా అదే
ఫలము లభిస్తుంది. అనగా అన్ని రూపాలు, అన్ని నామాలు ఒక్కటేనన్న సత్యాన్ని మన గ్రంధాలు, పురాణాలు చెబుతున్నాయి. ఒక పురాణము ప్రమాణమని, మరో పురాణము ప్రమాణము కాదని వాదించడములో అర్ధము  లేదు. అన్ని పురాణములు పరబ్రహ్మం యొక్క మహిమలనే చెప్తున్నాయని గ్రహించిన వారికి, అన్ని గ్రంధములు
ప్రమాణంగానే  కనిపిస్తాయి. ఒకటి నమ్మినప్పుడు మరొక దానిని నమ్మక తప్పదు.

 సాత్విక పురాణములే మోక్ష హేతువలని అన్నప్పుడు మరి మిగతా పురాణములు శ్రీవ్యాసుల వారు ఎందుకు రచించినట్లు? అసంబద్ధముగా లేదా? శివుణ్ణి, దేవిని వారి ఉనికిని ప్రశ్నించడము అన్నది ... దక్ష యజ్ఞములోని ఉదంతము నాకు గుర్తుకు వస్తున్నది.

రాముడే పరదైవం అనే వాళ్ళు కొందఱు, కాదు కృష్ణుడే పరాత్పరుడనే వారు మరి కొందరు, శివుడే భగవంతుడనే వారు కొందరు.  కాదు కాదు శక్తియే వీరందరికీ జన్మనిచ్చింది కాబట్టి ఆమెయే పరదేవత అనే వాళ్లు కొంత మంది లోకంలో వుంటారు. లోకములో భిన్నమైన రుచులు వుండడము సహజము గదా?
కానీ జ్ఞానులు మాత్రమే ఈ నామరూపాలకు, గుణత్రయానికి అతీతంగా వుండే నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకొంటారు. దీన్నిబట్టి మనకు తెలిసేదేమంటే ఎవరిమటుకు వాళ్లు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందాన,  పరుల విశ్వాసాన్ని నిందించడమే పనిగా పెట్టుకుంటారు. వీలందర్నీ ఆడించేది కర్మమే”, దానికి లోబడనివాడు లోకంలోనే వుండడు. చివరకు భగవంతుడైనా సరే నామరూపాలు  ధరిస్తే ఆ కర్మకు వశులు కాక తప్పదు. ఈ సత్యాన్ని తెలిసిన వాడె జ్ఞాని, యోగి, తెలియని వాడు మరలా కర్మ చక్రము లోనికి వస్తున్నాడు. తెలియని వానికి ముమ్ముక్షత్వం ఎలా లబిస్తుంది?

కర్మ చాలా బలమైనది అని ఎవడు గుర్తిస్తాడో, తెలుసుకొంటాడో వానికి అహంకారం తొలిగిపోతుంది. అహంకారం తొలిగిన వాడికి అన్ని రూపాలలోనూ పరమాత్మ కనిపిస్తాడు. సమదర్శనం అలవాటౌతుంది. వాడికే నిర్మల జ్ఞానం కలుగుతుంది. నిర్మల జ్ఞానం నుండి నిజమైన వైరాగ్యం పట్టుబడుతుంది. అటువంటి యోగికి ఒక రూపం నందు ప్రియము, మరొక రూపమునందు అప్రియము కలుగదు. అన్ని శాస్త్రములయందు, అన్ని రూపములయందు సమ దర్శనము పాటిస్తూ, ఆ నిరంజనుడ్ని, ఆ పర బ్ర్మహాన్ని దర్శిస్తాడు. ఒక దాన్ని ఎక్కువ మరొక దాన్ని తక్కువ చేసి మాట్లాడటము విబుధుల  లక్షణముగాదు గదా.

కొందరు ఈ విషయాలన్నీ తెలిసి కూడా , ప్రారబ్ధకర్మ చేత వశులై  అహంకారానికి, అజ్ఞానానికి లోబడి పోతూవుంటారు. దైవం ఒక్కడేనని, సృష్టి కార్యం కోసము, వివిధ నామ రూపాలను ధరిస్తాడని, వాటిలో ఏ నామ రూపాలతో ధ్యానించినా ఆ పరమాత్మ కరుణిస్తాడని తెలుసుకోవాలి. శైవులు నిరతయవుడైన లింగాకారాన్ని పరమాత్మగా ప్రార్ధిస్తారు. వైష్ణవులు నవ రత్న ఖచితమైన ఆభరణాలతో అలంకరించిన విష్ణువును పరమాత్మగా ఆరాధిస్తారు. ఎవరికి ఏ రూపం ఏ నామం ప్రియంగా వుంటుందో అతడా నామరూపాలతో ఆ పర బ్రహ్మాన్ని పిలుచుకోవచ్చు, కోలుచుకోవచ్చు. అన్ని రూపాలలో వుండేది ఆ ఒక్క పరబ్రహ్మామే అని, అందరూ ఒకటే అని తెలుసుకోన్నవాడే యోగి, జ్ఞాని . అందరిలో వున్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే  జ్ఞానము. ఒకటి ఎక్కువ చేసి, మరొక దానిని తక్కువ చేసి మాట్లాడటము సజ్జనుల  లక్షణముగాదు అని నా అభిమతము.

ప్రతి ద్వాపరయుగము నందు పురాణ సంహితలు వెలయించిన వ్యాసమహర్షులు వేరు వేరు. ప్రతి మన్వంతరము నందు వచ్చు ద్వాపరయుగమునందు ఒక్కో వ్యాస రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక్కో పురాణమును ప్రవచించెను. 28 ద్వాపరయుగమునందు,  శ్రీకృష్ణ ద్వైపాయణుడగు వ్యాసుడు వ్యాస పీఠమును అలంకరించిరి.



ఓ మునులారా సత్యవతీ తనయుడు అగు వ్యాస మహర్షి వలన నేను సకల పురాణములను వింటిని.
శ్రీకృష్ణ ద్వైపాయణుడగు వ్యాసుడు శ్రీ దేవీ భాగవత పురాణము ప్రవచించగా నేను వింటిని, వానిని మీకు చెప్పుదును .... అని సూతుడు తన శిష్యులకు చెప్పెను. ఇది ఋషి ప్రోక్తం. దీనిని మనము నమ్మి తీరవలయును.

భాగవతకారుడు మూర్ఖునిలా దుఃఖిస్తాడా ?  అని అన్నారు మీరు. రామాయణములో శ్రీ రాముడు సీతమ్మ కోసం దుఃఖించ లేదా? దశరధుడు దుఃఖించ లేదా? పుట్టిన ప్రతి వాడూ దుఃఖిస్తాడు. దానిలో తప్పు లేదనుకొ౦టాను.
కుమారుని కోసము తండ్రి  దుఃఖించడము లో తప్పు ఏమిటి? మరి అదే మాయ. మాయ ఎంతటి వాడ్ని అయినా లొంగదీసుకొంటుంది.

నేను కూడా ఒక గురు స్థానము అధిరోహించి, ఒక సాధికారతతో  చెప్పుచుంటిని, మా కులదైవం శ్రీవెంకటేశ్వర్లు,
నా ఇష్ట దైవం ఆ మహాశక్తి శ్రీమాత.  అష్టాక్షరీ, సుదర్శన, నారసింహా మహా మంత్రములచే రోజూ ఉపాసన చేస్తున్న నాకు 2000 సంవత్సరములో శివరాత్రి  పర్వ దినమున ఒక కోవెల లోని కోనేరులో స్నానము  చేస్తూవుంటే కాలికి గట్టిగా ఏదో తగిలినట్లయ్యింది, ఏమిటా అని తీసి పరిశీలిస్తే అది ఒక చిన్న మూట, విప్పి చూస్తే, మూడు విగ్రహాలున్నాయి. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీమన్నారాయణుని పంచ లోహ విగ్రహాలు ఆరు అంగుళాలు గలవి దొరికినవి. ఆ దేవ దేవుని మహా అనుగ్రహముగా  తలంచి మా శ్రీపీఠము లోనుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వస్తున్న వాడను. వంశ పారంపర్యంగా వస్తున్న పంచాయతనంతో బాటు గురు దేవులు ఇచ్చిన శ్రీ చక్రముతో
మా శ్రీనిలయం కొలువైయున్నది.
మమ సమస్తాంగాయుధావరణ నిత్యామ్నాయ పరివారదేవతా సహిత శ్రీ మహాకామేశ్వరాంక నిలయ
శ్రీ మహాకామేశ్వర్యా౦బా మహా శ్రీ చక్రనగర సామ్రాజ్ఞి  సాక్ష్యముగా నాకు శ్రీ మహావిష్ణువు మరియ శ్రీ మహా శివుని యందు యెటువంటి భేద భావము లేదు. ఎవ్వరినీ నొప్పించాలనీ లేదు. ఎవరి విశ్వాసములు వారివి. అందరికీ నమస్కారములు. ఎవరినైనా నొప్పించి వుంటే  క్షంతవ్యుడను.

ఇట్లు
మీ
భాస్కరానందనాథ
(కామరాజుగడ్డ రామచంద్రరావు)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.