శ్రీచక్రము
శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు.
అందుకే అది “చక్రరాజము” అయినది.
సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల
సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో
సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో.
మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని
దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది.
శ్రీచక్రము తొమ్మిది చక్రముల
సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము
లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు.
శరీరంలోని తొమ్మిది ధాతువులకు
ఇవి ప్రతీకలు. శ్రీచక్రము
లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు.
నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది
చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది.
తొమ్మిది చక్రములలో విడివిడిగా
ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన
బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు.
శివ, శక్తి, చక్రములతో
కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది.
అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల
నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము.
సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీ దేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము.
శ్రీచక్రము 3 రకములుగా లోకంలో పూజింపబడుచున్నది. ౧. మేరు ప్రస్తారము ౨.
కైలాస ప్రస్తారము ౩. భూ ప్రస్తారము.
సప్త కోటి మహా మంత్రములతో సర్వ
దేవతా స్వరూపమైన శ్రీచక్రమును పూజించిన యెడల, సర్వ శక్తులూ,
జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని
మన పూర్వీకులు, ఋషులు వక్కాణించి యున్నారు.
శ్రీచక్రము యొక్క నాలుగు
ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే దేవీ
సాక్షాత్కారం లభించినట్లే.
ఈ శ్రీవిద్యను మొదట్లో
పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య
సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను.
కామేశ్వరీ దేవి కోరిక మేరకు
చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర తంత్రము వలన కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరుని చే
నిర్మింపబడినవి. శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతి రూపమని చెప్పుదురు.
కాబట్టి అధికారముకల వారికి శ్రీవిద్యా తంత్రము, మిగతా వారికి
చతుషష్టి (64) తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి. ఈ శ్రీవిద్యోపాసన
వలన, శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహం చే
ఆత్మ విచారణ యందు ఆసక్తి కలిగి, ఐహిక భోగముల యందు విరక్తి
కలుగును. అందువలన బ్రహ్మ జ్ఞానము లభించును. అందుకే దీనిని బ్రహ్మవిద్య అని అన్నారు.
శ్రీవిద్యా మహా మంత్రములు
అనునవి మోక్ష సాధనమగు మార్గములుగా చెప్పబడినవి.
ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము కావలయును అనేవారికి
ఇవి నిర్దేశింపబడినవి.
శ్రీమాత్రే నమః
నమస్కారములతో
మీ
భాస్కరానందనాథ
(కామరాజుగడ్డ
రామచంద్రరావు)
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు
మంత్ర, యంత్ర, తంత్రోపాసకులు
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.